జగన్ జోస్యం ఫలిస్తుందా....?
వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అనుబంధ సంఘాల నేతలతో, జిల్లాల నాయకులతో భేటీ అవుతున్నారు. వారంలో రెండు రోజులు తాడేపల్లిలో ఉంటున్న జగన్... క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో తప్ప... క్షేత్రస్థాయిలో ఆశించిన మేర ఎక్కడా వైసీపీ నేతల్లో సరైన స్పందన కనిపించటం లేదు. ఇక జగన్ కూడా ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐదేళ్లు క్యాడర్కు దూరంగా ఉండటం వల్లే ఘోరంగా ఓడిపోయామని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆ అపవాదును తొలగించేందుకు వైఎస్ జగన్ నానా పాట్లు పడుతున్నారు. పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీరే నా ప్రాణం అంటూ కొత్త డైలాగ్ చెబుతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా సరే.. జనాల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న జగన్.. అనుబంధ సంఘాలకు కొత్త నేతలను నియమిస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీనే మెయిన్ టార్గెట్ చేశారు. కొత్త ప్రభుత్వానికి ఆరు నెలలు గడివిస్తామంటూ తొలి నాళ్లల్లో చెప్పిన మాటను జగన్ మర్చిపోయినట్లున్నారు. నెల రోజులు కూడా కాక ముందు నుంచే విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఓ వైపు జగన్ తీరు నచ్చక పార్టీలో సీనియర్లు వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. వైసీపీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదేమో అనే ఆలోచనతోనే పార్టీ వీడుతున్నట్లు తెలుస్తోంది. ఇక మరో ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోపే వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి భారీగా చేరికలలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీ కేడర్ను కాపాడుకునేందుకు జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ఒకడుగు ముందుకేసిన జగన్... ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది మన ప్రభుత్వమే అంటూ పార్టీ నేతలకు జోస్యం చెప్పారు జగన్. అయితే జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై పార్టీ నేతలో విమర్శలు చేస్తున్నారు. ముందు పార్టీని వీడుతున్న కేడర్ను కాపాడుకోకుండా... ఎప్పుడో నాలుగున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో గెలిచేది మనమే... మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ జగన్ చెప్పడం దేనికి సంకేతమనే చర్చ పార్టీలో జోరుగా నడుస్తోంది. జగన్ బెంగళూరు వెళ్లి జోస్యం నేర్చుకున్నారా అని కామెంట్లు చేస్తున్నారు. వై నాట్ 175 అని గొప్పగా చెప్పుకున్న జగన్కు... ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. సింహం సింగిల్ అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పినప్పటికీ... ప్రజలు మాత్రం కూటమికే పట్టం కట్టారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని... వ్యవస్థలను అస్తవ్యస్తం చేశారనే ఆరోపణలను జగన్ మూటగట్టుకున్నారు. అసలే అప్పుల ఊబిలో చిక్కుకున్న రాష్ట్రాన్ని కాపాడుతున్నామంటూ సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయినా సరే... జగన్ మాత్రం అధికారం మనదే... మన ప్రభుత్వమే వస్తుందంటూ వ్యాఖ్యానించడం జోస్యం చెప్పినట్లే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
About The Author
Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.